కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం... కోళ్లు, బాతులను చంపేయాలంటూ ఆదేశించిన ప్రభుత్వం!

Bird Flu in Kerala
  • కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ పంజా
  • 8 వేల పెంపుడు పక్షులను చంపేయనున్న అధికారులు
  • కోళ్లు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం
కేరళలో బర్డ్ ఫ్లూ పంజా కలకలం రేపుతోంది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో పంజా విసిరింది. ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాపించే అవకాశాలు ఉండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ దూరం వరకు పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, దాదాపు 8 వేల వరకు పక్షులను అధికారులు చంపేయనున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు, రెవెన్యూ, జంతు సంరక్షణ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో రక్షణ చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.  

ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్ లోని నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తినడం వల్ల జబ్బు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వలస పక్షులు, సముద్ర పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది.
Go Back to Shorts
Bird Flu
Kerala

More Telugu News