లాక్ డౌన్కు వ్యతిరేకంగా చైనాలో ఆగ్రహ జ్వాలలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు
- ఉరుమ్కిలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
- 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
- లాక్డౌన్ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని ఆరోపణ
- అదే వారి ప్రాణాలను తీసిందంటూ వీధుల్లోకి వచ్చి నిరసన
- లాక్డౌన్ను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని, దీని కారణంగా అగ్నిప్రమాదంలో చిక్కుకున్న బాధితులు సకాలంలో తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లాక్డౌన్ను ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ వీధుల్లోకి చొచ్చుకొచ్చారు. లాక్డౌన్ కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందన్న వార్తలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి బారికేడ్లు లేవని, నివాసితులు బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పుకొచ్చారు.
జిన్జియాంగ్లో గత 100 రోజులుగా కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక, ఉరుమ్కిలోని నాలుగు మిలియన్లమంది మూడు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమయ్యారు.