BRS: లోక్ సభ ఎన్నికల్లో 100 స్థానాలపై గురిపెడుతున్న బీఆర్ఎస్!

  • తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో బరిలోకి..
  • స్థానికంగా బలమైన అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్న వినోద్ కుమార్
  • డిసెంబర్ 7న పూర్తి వివరాలు వెల్లడిస్తారని వివరణ
Bharat Rashtra Samithi focus on 100 Lok Sabha seats

రాబోయే పార్లమెంట్ జనరల్ ఎలక్షన్లలో వంద లోక్ సభ స్థానాలకు భారత రాష్ట్ర సమితి తరఫున అభ్యర్థులు పోటీపడనున్నట్లు సమాచారం. ఈమేరకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆలోచనలు జరుపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిపాయి. అయితే, మొత్తం 543 స్థానాలకు పోటీ చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వివరించాయి. 

తెలంగాణలోని 17 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలోని 100 లోక్ సభ స్థానాల్లో పోటీపై పార్టీ అధినేత దృష్టిసారించారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు.. బీఆర్ఎస్ పార్టీ ఏయే పార్టీలతో కలుస్తుందనే వివరాలను ఇప్పుడే చెప్పలేమని టీఆర్ఎస్ నేత బి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ 7 న బీఆర్ఎస్ పేరు అధికారికంగా ఖరారైన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ అన్ని వివరాలు వెల్లడిస్తారని వివరించారు.

బీఆర్ఎస్ తరఫున పోటీకి ఎంపిక చేసే అభ్యర్థులలో ఆర్థిక, రాజకీయ పరపతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వినోద్ కుమార్ చెప్పారు. పెద్ద రాష్ట్రాలలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు అధికారికంగానే రూ.95 లక్షలుగా ఉందని, చిన్న రాష్ట్రాలలో ఈ మొత్తం రూ.75 లక్షలుగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో స్థానికంగా బలమైన కేండిడేట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News