Munugode: మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు

  • మునుగోడులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • నామినేషన్లు ఉపసంహరించుకున్న 36 మంది అభ్యర్థులు
  • ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి బరిలో నిలిచిన 47 మంది అభ్యర్థులు
47 candidates fray in munugode bypoll

తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగిసింది. నామినేషన్ల గడువు ముగిసేలోగా 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 47 మంది నిలిచారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీతో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ తరఫున ఓ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ గా కే ఏ పాల్ కూడా బరిలో నిలిచారు.

More Telugu News