Women IPL: వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్!

  • ఎప్పటినుంచో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని డిమాండ్
  • టోర్నీపై నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!
  • 5 జట్లతో మహిళల ఐపీఎల్
  • విశాఖ, కొచ్చి నగరాలతో సౌత్ జోన్ ఫ్రాంచైజీ!
Women IPL set to be in next year March

పురుషుల తరహాలోనే మహిళా క్రికెటర్లకు కూడా ఐపీఎల్ నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇన్నాళ్లకు అది సాకారమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది.

మొదటి ఎడిషన్ లో 5 జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ టోర్నీ లీగ్ దశలో 20 మ్యాచ్ లు ఉంటాయని, ఒక్కో జట్టు ఇతర జట్లతో రెండేసి పర్యాయాలు తలపడుతుందని తెలుస్తోంది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో అడుగుపెడుతుంది. 

కాగా, తుదిజట్టులో ఐదుగురికి మించి విదేశీ ఆటగాళ్లను ఆడించే అవకాశం లేదు. ఆ ఐదుగురిలోనూ నలుగురు ఐసీసీ పూర్తిస్థాయి సభ్యదేశాలకు చెందినవారై ఉండాలి. మరొకరు ఐసీసీ అనుబంధ సభ్యదేశాలకు చెందినవారై ఉండాలి. 

దక్షిణాఫ్రికాలో ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు మహిళల టీ20 క్రికెట్ టోర్నీ జరగనుండగా, ఈ ఐసీసీ ఈవెంట్ ముగిశాక మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా, మహిళల ఐపీఎల్ లో విశాఖపట్నం, కొచ్చి నగరాలతో సౌత్ జోన్ ఫ్రాంచైజీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. జోన్ల ప్రాతిపదికన మహిళల ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు విక్రయించనునున్నట్టు సమాచారం.

More Telugu News