Ola: ఓలా ఉద్యోగులకు షాక్.. 10 శాతం జాబ్స్ కట్!

  • ప్రస్తుతం ఓలాలో 2000 వేలమంది ఇంజినీర్లు
  • పలు రంగాల్లో బలోపేతం కావడమే లక్ష్యమన్న ఓలా
  • వచ్చే 18 నెలల్లో ఇంజినీరింగ్ వర్క్‌ఫోర్స్‌ను 5 వేలకు పెంచుతామంటూ విరుద్ధ ప్రకటన
  • ఐపీవో ఆలోచనకు ఫుల్‌స్టాప్
Ola says it will cut 10 per cent of engineering jobs

దేశంలోని అతిపెద్ద మొబిలిటీ ప్లాట్‌ఫామ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా తమ ఉద్యోగులకు షాకిచ్చే ప్రకటన చేసింది. తమ వర్క్ ఫోర్స్‌లోని పది శాతం మంది ఇంజినీరింగ్ ఉద్యోగులు అంటే దాదాపు 200 మందిని బయటకు పంపేందుకు ప్రణాళిక రచించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో 2000 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల మార్కెట్ ఒడిదొడుకులు, 1400 కుపైగా స్కూటర్లను వెనక్కి రప్పించడం వంటివి ఆ సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనికితోడు ఎస్1 ప్రొ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పడిపోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణంగా తెలుస్తోంది. 

విరుద్ధ ప్రకటన
200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్టు వార్తలు వస్తుండగా ఓలా మాత్రం అందుకు విరుద్ధ ప్రకటన చేసింది. వచ్చే 18 నెలల్లో తమ ఇంజినీరింగ్ వర్క్‌ఫోర్స్‌ను 2 వేల నుంచి 5 వేలకు పెంచే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ కంపెనీగా ఉండడంపై దృష్టి సారించామన్న ఓలా.. ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్, సెల్ రీసెర్చ్, ఆటోమేషన్, తయారీ రంగాల్లో మరింత బలోపేతం కావాలని, మార్కెట్లో పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.

2024లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి
రైడ్ హైలింగ్ మార్కెట్లో ఉబెర్‌ను అధిగమించిన ఓలా.. గతేడాది ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ రంగంలోకి దిగింది. అంతేకాదు, 2024లో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించనున్నట్టు ఆగస్టు 15న ప్రకటించింది. తాము తీసుకొచ్చే ఎలక్ట్రిక్ కారు నాలుగు సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.  

ఐపీవో వాయిదా
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో ఓలా స్కూటర్‌ ఒక్కసారిగా పేలిపోయిన నేపథ్యంలో 1400కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. దీనికితోడు మార్కెట్లో అస్థిరత, దేశీయ స్టార్టప్‌ల మందగమనం వంటి వాటివల్ల పబ్లిక్‌లోకి వెళ్లాలన్న తమ ప్లాన్స్‌ను వాయిదా వేసింది.

More Telugu News