CM KCR: ఇన్నాళ్లూ బంజారాహిల్స్​ లోనే బంజారాలకు చోటు లేదు: సీఎం కేసీఆర్​

  • తమ ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించిందన్న కేసీఆర్
  • జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక గిరిజనులపై ఏకీకృత విధానం తెస్తామని వెల్లడి
  • గిరిజనుల సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేస్తున్నామన్న సీఎం
CM KCR inaugurated banjara Adivasi bhavans

ఇన్నాళ్లుగా బంజారాహిల్స్ లోనే బంజారాలకు చోటు లేకుండా పోయిందని.. తమ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండ‌గా ఉంటుంద‌న్నారు. శనివారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 10లో బంజారా, ఆదివాసీల కోసం నిర్మించిన భవనాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 

గిరిజనుల సమస్యలు తీర్చేదిశగా అడుగులు
గిరిజన బిడ్డల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో ఆదివాసీ, గిరిజన, లంబాడీ బిడ్డలందరూ తలెత్తుకునేలా భవనాలు నిర్మించామని తెలిపారు. సొంత రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌరవం కోసం జాతి మొత్తానికి తెలిసేలా భవనాలు నిర్మించుకోవడం గర్వకారణమన్నారు. స్థానికంగా, విదేశాల్లో చదువులు, గిరిజన పోడు భూముల విషయంలో ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో క్రమంగా పురోగమిస్తున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా సమానంగా బంజారాలకు రిజర్వేషన్లు
బంజారాలు, ఆదివాసీలు తలెత్తుకునేలా భవనాలను నిర్మించామని.. ఆదివాసీ, బంజారా హక్కుల పరిరక్షణకు ఈ భవనాలు వేదికలుగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో బంజారాలు బీసీల జాబితాలో ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా బంజారాలకు సమాన రిజర్వేషన్లు ఉండాలని.. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక దీనిపై ఏకీకృత విధానం తీసుకొస్తామని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం బంజారాహిల్స్ లో బంజారాలకు రూ.21.71కోట్లతో సంత్‌ సేవాలాల్‌ భవన్.. ఆదివాసీలకు రూ.21.50 కోట్ల ఖర్చుతో కుమురం భీం భవనాలను నిర్మించింది. తాజాగా వీటిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

More Telugu News