నిత్యానంద ఆరోగ్య పరిస్థితి సీరియస్.. శ్రీలంక ఆశ్రయానికి వేడుకోలు
- శ్రీలంక అధ్యక్షుడికి లేఖ
- అత్యవసరంగా వైద్య సాయం కావాలని వినతి
- ఖర్చునంతా తామే భరిస్తామని హామీ
- పెట్టుబడులు సైతం పెడతానన్న నిత్యానంద
తన దీవిలో వైద్య సదుపాయాల లేమిని లేఖలో నిత్యానంద ప్రస్తావించారు. తీవ్ర అనారోగ్యంతో అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సిన స్థితిలో ఉన్నట్టు వివరించారు. ఈ లేఖను నిత్యానంద తరఫున శ్రీకైలాస విదేశాంగ మంత్రి నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి రాశారు. స్థానికంగా ఉన్న వైద్య సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకున్నా ఫలితం లేదని, అనారోగ్యానికి కారణమేంటన్నది వైద్యులు తెలుసుకోలేకపోతున్నారని వివరించారు.
రాజకీయ ఆశ్రయాన్ని వెంటనే మంజూరు చేయాలని, దాంతో ఎయిర్ అంబులెన్స్ లో వెంటనే తరలిస్తామని చెప్పారు. అనంతరం శ్రీలంకలో సురక్షిత ప్రదేశంలో వైద్య చికిత్స తీసుకుంటారని పేర్కొన్నారు. ఇందుకు అయ్యే వ్యయాలను తాము భరిస్తామని చెప్పారు. ఎంత ఖరీదైనా సరే వైద్య ఉపకరణాలను తాము కొనుగోలు చేసుకుంటామని, చికిత్స తర్వాత వాటిని శ్రీలంక కోసం విడిచి వెళతామని తెలిపారు.
రద్దు చేయలేని రాజకీయ ఆశ్రయం మంజూరు చేస్తే శ్రీలంకలో స్వామి పెట్టుబడులు కూడా పెడతారని హామీ ఇచ్చారు. నిత్యానంద అత్యాచార కేసును ఎదుర్కొంటున్నారు. 2010లో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత విదేశానికి మకాం మార్చారు.