China Mobiles: అలాంటి ప్రతిపాదనేదీ లేదు: రూ. 12 వేల లోపు చైనా ఫోన్ల నిషేధం వార్తలపై కేంద్రం స్పష్టీకరణ

No ban on Chinese phones below Rs 12000
  • ఆ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో తెలియదన్న కేంద్రమంత్రి
  • చైనా కంపెనీలు తమ కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించేలా చేయడమే లక్ష్యమని స్పష్టీకరణ
  • ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ కంపెనీలు ముఖ్యపాత్ర పోషించాలన్న రాజీవ్ చంద్రశేఖర్

చైనా మొబైల్ మేకర్స్ భారత్‌లో విక్రయిస్తున్న రూ. 12 వేల లోపు స్మార్ట్‌ఫోన్లను నిషేధిస్తున్నట్టు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. దేశీయ మొబైల్ కంపెనీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చైనా నుంచి దిగుమతి అయ్యే రూ. 12 వేల లోపు ఫోన్లపై కేంద్రం నిషేధం విధిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అలాంటి యోచనేదీ లేదని స్పష్టం చేశారు.

ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్టు చెప్పిన మంత్రి.. అంతమాత్రాన విదేశీ బ్రాండ్లను పూర్తిగా లేకుండా చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. రూ. 12 వేల లోపు చైనా ఫోన్లను నిషేధించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చైనా కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించేలా చూడడమే తమ లక్ష్యమని అన్నారు. అలాగే, దేశంలో తయారీ, అసెంబ్లీ యూనిట్లు నిర్వహిస్తున్న చైనా కంపెనీలకు ఎగుమతులు పెంచాలని మంత్రి సూచించారు.

  • Loading...

More Telugu News