Mahbubnagar District: ఒక్క జడే వేసుకున్నారని.. ఒక్కొక్కరితో 200 గుంజీలు తీయించిన పీఈటీ.. సస్పెండ్ చేసిన కలెక్టర్

  • జడ్చర్ల మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన
  • కాళ్లకు వాపులు, జ్వరంతో బాధపడిన విద్యార్థినులు
  • 25 మందిని ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • పీఈటీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆందోళన
  • కలెక్టర్ ఆదేశాలతో పీఈటీ శ్వేతను తొలగించిన అధికారులు
PET Suspended after forcibly SitUps with Students in Jadcherla

రెండు జడలకు బదులుగా ఒక్క జడ ఎందుకు వేసుకొచ్చారంటూ విద్యార్థినులతో 200 గుంజీల చొప్పున తీయించాడో పీఈటీ. దీంతో అలా తీసినవారంతా అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన. గుంజీల కారణంగా 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాళ్లకు వాపులు వచ్చి నడవలేకపోయారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి సిబ్బందిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

అస్వస్థతకు గురైన విద్యార్థులను పట్టణ ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యుడు శివకాంత్ నిన్న పరీక్షించారు. నొప్పుల కారణంగా కొందరు నడవలేని స్థితికి చేరుకోగా, మరికొందరు జ్వరం బారినపడ్డారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన 25 మందిని బాదేపల్లి కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పీఈటీ శ్వేత తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో స్పందించిన ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు పీఈటీని విధుల నుంచి తొలగించారు.

More Telugu News