Ambati Rambabu: పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం: ఏపీ మంత్రి అంబటి

  • కాసులకు కక్కుర్తిపడి చారిత్రక తప్పిదం చేశారన్న అంబటి
  • కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రం వాల్ ఎలా కట్టారని ఆగ్రహం
  • టీడీపీ తప్పులకు తాము బాధ్యత వహించబోమని వెల్లడి
Ambati fires on TDP leaders

పోలవరం ప్రాజెక్టు అంశంలో మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరోసారి ధ్వజమెత్తారు. మీడియాకు పోలవరంపై మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాసులకు కక్కుర్తిపడి పోలవరం విషయంలో చారిత్రక తప్పిదం చేశారని విమర్శించారు. పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణమని అన్నారు. 

పోలవరం పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ 2018లో అన్నారని, కానీ పోలవరం పూర్తయిందా? అంటూ ప్రశ్నించారు. ఆర్ అండ్ ఆర్ ప్రక్రియ పూర్తికాకుండా ప్రాజెక్టు ఎలా పూర్తిచేస్తారని నిలదీశారు. కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రం వాల్ కట్టారని, అందులోనూ నిర్లక్ష్యం కనబర్చారని అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం విషయంలో తప్పిదాలకు పాల్పడిన టీడీపీ తమపైనే తప్పుడు ప్రచారం చేస్తోందని, టీడీపీ తప్పిదాలకు తాము బాధ్యత వహించబోమని స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్టును  పూర్తిచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఏదన్నా మాట్లాడితే చాలు... అంబటి రాంబాబుకు ఏమీ తెలియదని అంటున్నారని, తెలియదు కాబట్టే అందరితో చర్చించి విషయాలు తెలుసుకుంటున్నానని వివరించారు. జాతికి ద్రోహం చేసినవాళ్లా, మమ్మల్ని విమర్శించేది? అంటూ మండిపడ్డారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తమ పత్రికల్లో పిచ్చిరాతలు రాసి జగన్ పై బురద చల్లాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని హితవు పలికారు.

More Telugu News