BJP: బీజేపీ ఎంపీ అర్వింద్ ను అడ్డుకున్న గ్రామస్థులు.. కాన్వాయ్‌పై దాడి

  • వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న‌కు వెళ్లిన ఎంపీ
  • భూ వివాదాన్ని ఎందుకు ప‌రిష్క‌రించలేద‌ని నిల‌దీసిన ఎర్దండి వాసులు
  • గ్రామ‌స్థుల‌పై ఎంపీ అనుచ‌రులు దాడి చేసిన‌ట్లు ప్ర‌చారం
  • తిరుగు ప్ర‌యాణంలో ఎంపీ కాన్వాయ్‌పై దాడికి దిగిన గ్రామ‌స్థులు 
villagers attack on bjp mp arvind convoy

బీజేపీ యువ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌కు శుక్ర‌వారం చేదు అనుభ‌వం ఎదురైంది. వ‌ర‌ద ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న‌కు వెళ్లిన ఆయ‌న‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆపై ఆయ‌న కాన్వాయ్‌పై దాడికి దిగారు. జ‌గిత్యాల జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం ఎర్దండిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... వ‌రద ప్రాంతాల ప‌రిశీల‌న‌కు ఎంపీ వస్తున్నార‌ని తెలుసుకున్న ఎర్దండి వాసులు ఆయ‌న ముందు నిర‌స‌న తెలిపేందుకు య‌త్నించారు. త‌మ గ్రామానికి చెందిన ఓ భూ వివాదాన్ని ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చిన అర‌వింద్ ఆ త‌ర్వాత దానిని ప‌ట్టించుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన గ్రామ‌స్థులు ఎంపీ కాన్వాయ్‌కు రోడ్డుకు అడ్డంగా నిలుచున్నారు. అయితే పోలీసులు గ్రామ‌స్థులను ప‌క్క‌కు త‌ప్పించి ఎంపీ కాన్వాయ్‌ని ముందుకు పంపించారు. 

ఈ స‌మ‌యంలో అర్వింద్ వెంట వ‌చ్చిన బీజేపీ శ్రేణులు గ్రామ‌స్థులపై దాడికి దిగార‌న్న వార్త‌తో వారంతా ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకున్నారు. వ‌ర‌ద ప్రాంతాల ప‌రిశీల‌న ముగించుకుని తిరిగి వ‌స్తున్న ఎంపీ కాన్వాయ్‌ను గ్రామ‌స్థులు మ‌రోమారు ఆపేశారు. దీంతో వారిపై పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా... ఎంపీ కాన్వాయ్‌పై గ్రామ‌స్థులు దాడికి దిగారు. 

ఈ దాడిలో కాన్వాయ్‌లోని ఓ కారు రెండు అద్దాలు ప‌గిలిపోయాయి. ఎలాగోలా ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు... గ్రామ‌స్థులను ప‌క్క‌కు త‌ప్పించి ఎంపీ కాన్వాయ్‌ను అక్క‌డి నుంచి పంపించివేశారు. ఈ దాడిని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తీవ్రంగా ఖండించారు.

More Telugu News