Mahesh Babu: ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన మహేశ్-త్రివిక్రమ్.. అధికారిక ప్రకటన!

  • ఇద్దరి కాంబినేషన్లో మూడో సినిమా ప్రకటన
  • ఆగస్టులో ప్రారంభం కానున్న షూటింగ్
  • మహేశ్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే
Mahesh babu trivikram united third time

సూపర్ స్టార్ మహేశ్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ‘అతడు’తో మహేశ్ కెరీర్ లో గుర్తుండిపోయే విజయాన్ని అందించి, ‘ఖలేజా’తో సూపర్ స్టార్ నటనలోని కొత్త కోణాన్ని అభిమానులకు పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు సూపర్ స్టార్ తో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు సిద్దమయ్యాడు. మహేశ్ బాబు 28వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. 

ఈ సినిమాను శనివారం అధికారం ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చిత్రం బృందం తెలిపింది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పింది. 2023 వేసవిలో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. 

ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన ‘మహర్షి’ సినిమా ప్రేక్షకులను అలరించింది. మరోసారి మహేశ్, పూజ హెగ్డే కలిసి నటిస్తుండటంతో తాజా చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించాల్సి ఉంది.

More Telugu News