Chandrababu: టీడీపీలోని బలమైన బీసీ నేతలే జగన్ టార్గెట్: చంద్రబాబు

  • అయ్యన్న ఇంటిగోడ కూల్చివేసిన అధికారులు
  • అక్కసుతోనే దాడులు చేశారన్న చంద్రబాబు
  • ముమ్మాటికీ వైసీపీ కక్షసాధింపేనని ఆగ్రహం
  • అయ్యన్న వెంట టీడీపీ ఉందని వెల్లడి
Chandrababu alleged Jagan targets strong BC leaders in TDP

నర్సీపట్నంలో ఓ పంటకాల్వను రెండు సెంట్ల మేర ఆక్రమించి ఇల్లు కట్టారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటిగోడను పురపాలక శాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిగోడను అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేయడం ముమ్మాటికీ వైసీపీ కక్షసాధింపేనని ఆరోపించారు. టీడీపీలో బలమైన బీసీ నేతలనే జగన్ లక్ష్యంగా చేసుకుంటున్నారని, వారిపై అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

చోడవరం మినీ మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాడనే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడి ఇంటిపై చీకటి దాడులు చేయించారని చంద్రబాబు విమర్శించారు. అయ్యన్నపాత్రుడు అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ సమాధానం ఇచ్చే దమ్ములేని జగన్ కూల్చివేతలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడి వెంట తెలుగుదేశం పార్టీ ఉందని స్పష్టం చేశారు.

More Telugu News