Anantapur District: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మోదీ ఫొటో ఉండాల్సిందే: అనంతపురంలో కేంద్రమంత్రి శోభ

  • అనంతపురంలో పర్యటించిన మంత్రి శోభ
  • కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి
  • మంత్రికి ఫిర్యాదు చేస్తున్న పయ్యావులను అడ్డుకున్న ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ విప్
Union minister shobha fires on ap govt on Central welfare schemes

ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై ఇటీవల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే తాజాగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిన్న అనంతపురం జిల్లాలో పర్యటించిన మంత్రి.. కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై గురువారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మోదీ ఫొటో ఉండాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జగన్ సొంతపేర్లు పెట్టుకుని తమవిగా ప్రచారం చేసుకుంటున్నారంటూ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా మంత్రి శోభ దృష్టికి తీసుకెళ్లారు. 

అయితే, ఆయనను అడ్డుకున్న మంత్రి ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వాగ్వివాదానికి దిగారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి శోభ.. కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలపై ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కలెక్టర్‌దేనని మంత్రి పేర్కొన్నారు.

More Telugu News