Rahul Gandhi: వరంగల్ లో నేడు రాహుల్ సభ.. వందలాది మంది పోలీసులతో భారీ భద్రత!

  • నేడు వరంగల్ లో రైతు సంఘర్షణ సభ
  • సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
  • వరంగల్ కు చేరుకున్న 50 మంది కమెండోలు
High security for Rahul Gandhi Warangal rally

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వరంగల్ లో ఈరోజు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. సభకు సంబంధించి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. 

'రైతు సంఘర్షణ సభ' పేరుతో నిర్వహించనున్న ఈ సభను రాష్ట్ర కాంగ్రెస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో జవసత్వాలను నింపుతుందని, ఎన్నికల దిశగా కదం తొక్కేలా స్ఫూర్తిని నింపుతుందని పీసీసీ భావిస్తోంది. మరోవైపు రాహుల్ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రాహుల్ కు వ్యక్తిగతంగా ఎన్ఎస్జీ కమెండోలు సెక్యూరిటీగా ఉంటారు. ఎన్ఎస్జీ కమెండోలు వేదిక చుట్టూ వలయంలా ఉంటారు. వరంగల్ కు ఇప్పటికే సుమారు 50 మంది కమెండోలు వచ్చినట్టు తెలుస్తోంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్పైడర్ తో పర్యవేక్షణ ఉంటుంది. 

దీనికి తోడు వరంగల్ పోలీసులు పెద్ద సంఖ్యలో రాహుల్ భద్రత విధుల్లో ఉంటారు. ఒక డీసీపీ, ఏడుగురు ఏసీపీలు, 29 మంది ఇన్స్ పెక్టర్లు, 60 మంది ఎస్ఐలు, 132 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 836 మంది వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారు. వీరిని వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షిస్తుంటారు.

More Telugu News