V Prashanth Reddy: ఉన్న విష‌యం చెబితే అంత అక్క‌సు ఎందుకు?.. బొత్స‌పై తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఫైర్‌

  • ఏపీ గురించి కేటీఆర్ ఉన్న మాటే అన్నారన్న ప్ర‌శాంత్ రెడ్డి 
  • ఏపీలో రోడ్లు బాగా లేవు మ‌రి
  • రాష్ట్రంలో క‌రెంటు కోతలున్నాయ‌ని వారి సీఎం చెప్పారు
  • ఉన్న‌మాట అంటే అంత ఉలుకెందుకు? అన్న మంత్రి
telangana minister prashanth reddy fires on botsa satyanarayana comments

ఏపీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇచ్చిన కౌంట‌ర్ కు టీఆర్ఎస్ నుంచి వ‌రుస‌గా ఘాటు ప్ర‌తిస్పంద‌న‌లు ఎదుర‌వుతున్నాయి. బొత్స వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సెటైరిక్‌గా స్పందించగా...తాజాగా తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కూడా బొత్స వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డ్డారు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ "ఏపీ గురించి కేటీఆర్ వాస్త‌వాలే చెప్పారు. బొత్స కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. బొత్స‌తో పాటు అక్క‌డి నేత‌ల కుటుంబాల‌న్నీ ఇక్క‌డే ఉంటున్నాయి. మీరూ (మీడియా ప్ర‌తినిధులు) కూడా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు క‌దా. మ‌రి మ‌నం జ‌న‌రేట‌ర్ల‌ను వాడుతున్నామా? హైద‌రాబాద్‌లో జ‌న‌రేట‌ర్లు వాడుతున్నామ‌న్న వ్యాఖ్య‌ల‌ను బొత్స విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా. ఎందుకంత అక్క‌సుగా మాట్లాడాలి. ఉన్న విష‌యమే కేటీఆర్ చెప్పారు. ఏపీలో రోడ్లు బాగా లేవు మ‌రి. క‌రెంటుకు ఇబ్బంది ఉన్న‌ద‌ని వారి ముఖ్యమంత్రే చెప్పారు.  విజ‌య‌వాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఏపీని అభివృద్ధి చేస్తే మేం ఏమైనా అడ్డుప‌డుతున్నామా? ఉన్న మాట అంటే ఉలికిప‌డ‌ట‌మెందుకు? అంటూ ప్ర‌శాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

More Telugu News