Maruti Suzuki: నేటి నుంచి మారుతీ సుజుకి కార్ల ధరలు ప్రియం

  • ధరలు పెంచుతామని గతంలోనే చెప్పిన మారుతి
  • ఉత్పాదక వ్యయాలు పెరిగిపోతుండడం వల్లే పెంచాల్సి వచ్చిందన్న కంపెనీ 
  • అన్ని మోడళ్లపైనా ఒకే రీతిలో 1.3 శాతం పెంపు
Maruti Suziki cars prices hike onward from today

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఇటీవల తన వాహన శ్రేణి ధరలను 1.3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించడం తెలిసిందే. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 18 నుంచి హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎంపీవీ, ఎస్ యూవీ మోడళ్లన్నింటికీ ధరల పెంపు వర్తించనుంది. వివిధ రకాల ఉత్పాదక వ్యయాలు పెరిగిపోతుండడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతి సుజుకి గతంలోనే వివరణ ఇచ్చింది. 

అయితే మోడళ్లను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని ఇంతక్రితం పేర్కొన్న మారుతి... తాజాగా అన్ని మోడళ్లపైనా ఒకే రీతిలో 1.3 శాతం ధరల పెంపును నిర్ధారించింది. మారుతి ప్రస్తుతం భారత్ లో ఆల్టో, ఎస్ ప్రెస్సో, వాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, ఈకో, డిజైర్, ఎర్టిగా, విటారా బ్రెజా, న్యూ బాలెనో, ఇగ్నిస్, సియాజ్, ఎస్ క్రాస్ కార్లను విక్రయిస్తోంది. 

వీటిలో ఎర్టిగా, విటారా బ్రెజా మోడళ్లను తన ఎరీనా డీలర్ షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న మారుతి.... న్యూ బాలెనో, ఇగ్నిస్, సియాజ్, ఎస్ క్రాస్ వంటి ప్రీమియం మోడళ్లను నెక్జా అవుట్ లెట్ల ద్వారా విక్రయిస్తోంది. త్వరలోనే నెక్జా వాహన శ్రేణిలోకి ఎక్స్ఎల్-6 కారు వచ్చి చేరనుంది.

More Telugu News