నాడు తమ క్రికెటర్ల వెంట భార్యలను భారత్ కు ఎందుకు పంపిందీ వివరించిన పీసీబీ మాజీ చైర్మన్

Wives of Pakistan cricketers were sent to India in 2012 to keep an eye on players
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ జాకా అష్రాఫ్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. భారత్ తో పాకిస్థాన్ చివరి ద్వైపాక్షిక క్రికెట్ 2012లో జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. నాడు క్రికెటర్లతోపాటు వారి భార్యలను కూడా భారత్ పర్యటనకు పీసీబీ పంపించినట్టు చెప్పారు. అష్రాఫ్ నాడు పీసీబీ అధ్యక్షుడిగా ఉన్నారు. క్రికెటర్ల వైపు నుంచి ఎటువంటి తప్పులకు అవకాశం ఉండకూడదనే నాడు అలా చేసినట్టు ఆయన చెప్పారు.

‘‘నా హయాంలో మన జట్టు (పాకిస్థాన్) భారత్ కు వెళ్లినప్పుడు వారి వెంట భార్యలు కూడా ఉండాలని సూచించాను. భారత్ మీడియా అదే పనిగా అవకాశం కోసం చూస్తుంది. కనుక ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. వెంట భార్యలు ఉంటే ఆటగాళ్లు నియంత్రణలో ఉంటారు.

క్రమశిక్షణగా నడుచుకోవాలని ఆటగాళ్లకు చెప్పాం. పాకిస్థాన్ జట్టు భారత్ కు వెళ్లినప్పుడల్లా అక్కడి మీడియా మమ్మల్ని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. మన క్రికెటర్లు, దేశం ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకు అవకాశం ఇవ్వకూడదనే నాడు అలా వ్యవహరించాం’’ అని అష్రాఫ్ తాజాగా వెల్లడించారు. నాడు పాక్ జట్టు భారత్ లో మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడింది. 

Go Back to Shorts
Pakistan
cricketers
Wives
India tour
Zaka Ashraf

More Telugu News