Team India: అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన జూనియర్లు

  • 233 పరుగుల ఛేదనలో తడబడిన ప్రొటీస్ జూనియర్స్
  • 187 పరుగులకే ఆలౌట్
  • 5 వికెట్లతో నడ్డివిరిచిన ఓస్వాల్
Team India Beat South Africa In Their First Encounter In Under 19 World Cup

అండర్ 19 వరల్డ్ కప్ లో జూనియర్ టీమ్ అదరగొట్టింది. బ్యాటింగ్ లో యశ్ ధూల్, బౌలింగ్ లో విక్కీ ఓస్వాల్ మెరవడంతో గయానా వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను టీమిండియా మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆదిలోనే ఓపెనర్లు హర్నూర్ సింగ్, ఆంక్రిష్ రఘువన్షిలు వికెట్లు కోల్పోయినా షేక్ రషీద్ తో కలిసి మరో వికెట్ పడకుండా యశ్ ధూల్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. మూడో వికెట్ కు ఇద్దరూ 72 పరుగులు జోడించారు. యశ్ ధూల్ వంద బంతుల్లో 82 రన్స్ చేశాడు. నిశాంత్ సంధూ, కౌషల్ తంబేలూ మంచి ప్రదర్శన చేశారు.

233 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. 187 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బ్రూయిస్ (65) టాప్ స్కోరర్. కిటిమి 25 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో విక్కీ ఓస్వాల్ 5 వికెట్లు పడగొట్టి.. దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు. రాజ్ బజ్వా నాలుగు వికెట్లు తీశాడు. ఈ విజయంతో గ్రూప్ సీలో ఉన్న టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

More Telugu News