Rahul Dravid: బ్యాటింగ్ సవాలుగా మారింది: టీమిండియా ఓట‌మిపై రాహుల్ ద్రావిడ్

  • విరాట్‌ కోహ్లీ మెడ నొప్పితో బాధ‌ప‌డ్డాడు
  • మూడో టెస్టులో ఆడే అవ‌కాశం
  • రెండో టెస్టులో మ‌రో 60 ప‌రుగులు చేస్తే బాగుండేది
  • మూడో టెస్టులో గెలుస్తామ‌ని ఆశిస్తున్నాం
dravid on defeat

గాయం కార‌ణంగా ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మ‌న్ రోహిత్‌ శర్మ దూర‌మైన విష‌యం తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్‌ నుంచి తప్పుకున్నాడు. నిన్న ముగిసిన‌ రెండో టెస్ట్ లో టీమిండియా ఓడిపోయింది. ఈ నేప‌థ్యంలో మీడియా సమావేశంలో టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ మాట్లాడుతూ కోహ్లీ గాయం గురించి వివ‌రాలు తెలిపారు.

విరాట్‌ కోహ్లీ మెడ నొప్పితో బాధ‌ప‌డ్డాడ‌ని, ఆయ‌న‌ ప్రస్తుతం కోలుకున్నాడని ద్రావిడ్ వివ‌రించారు. త్వరలో నెట్ సెషన్‌లో పాల్గొంటాడని చెప్పారు. అతని గాయంపై తాను ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నాన‌ని తెలిపారు. కేప్‌టౌన్ లో జ‌రిగే మూడో టెస్ట్ మ్యాచులో విరాట్‌ కోహ్లీ తిరిగి ఆడ‌తాడని తాము భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఇక ద‌క్షిణాఫ్రికా పిచ్‌లపై బ్యాటింగ్ ఇరు జట్లకు సవాలుగా మారిందని ఆయ‌న తెలిపారు. రెండో మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ బాగా రాణించార‌ని ఆయ‌న చెప్పారు. టీమిండియా మరో 60 పరుగులు చేసి ఉంటే బాగుండేదని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

భార‌త ఆట‌గాడు హనుమ విహారి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బాగా ఆడాడ‌ని ఆయన ప్రశంసించారు. గతంలో శ్రేయాస్ అయ్యర్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడని, అవకాశం వచ్చినప్పుడు యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నార‌ని చెప్పారు. మూడో టెస్టులో గెలిచి టీమిండియా ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంద‌ని తాము ఆశిస్తున్న‌ట్లు ద్రావిడ్ తెలిపారు. కాగా తొలి టెస్టులో టీమిండియా గెల‌వ‌గా, రెండో టెస్టులో ద‌క్షిణాఫ్రికా గెలిచింది. మూడో టెస్టు కీల‌కంగా మారింది.

More Telugu News