ICC: స్లో ఓవర్ రేట్... సౌతాఫ్రికాతో తొలి టెస్టు విషయంలో టీమిండియాకు ఐసీసీ జరిమానా!

  • స్లో ఓవర్ రేట్ పై ఆటగాళ్లకు 20% జరిమానా
  • వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్లలో ఒక పాయింట్ కోత
  • తన తప్పును కోహ్లీ ఒప్పుకొన్నాడన్న ఐసీసీ
ICC Cuts One Point From World Test Championship Points For India

సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2021ని విజయంతో ముగించడం పట్ల అభిమానులు, టీమిండియా ఆటగాళ్లు ఆనందంలో ఉన్నా.. టీమిండియాకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. మ్యాచ్ లో టీమిండియా చాలా నిదానంగా బౌలింగ్ చేసిందని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ ఆండ్రూ పైక్రాఫ్ట్ తేల్చారు.

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. జట్టు ఆటగాళ్లందరికీ స్లో ఓవర్ రేట్ పై జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేశారు. అంతేగాకుండా వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్స్ టేబుల్ లోనూ కోత విధించారు. ఐసీసీ మెన్స్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ప్లేయింగ్ కండిషన్స్ లోని ఆర్టికల్ 16.11 ప్రకారం.. పాయింట్ల పట్టికలో ఒక పాయింట్ ను కోసేశారు.

తాను తప్పు చేసినట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఒప్పుకొన్నాడని, కాబ్టటి ఆంక్షల మీద తదుపరి విచారణలు అవసరం లేదని పేర్కొన్నారు. స్లో ఓవర్ రేట్ పై మ్యాచ్ లో అంపైర్లుగా వ్యవహరించిన మరైస్ ఎరాస్మస్, ఆడ్రియన్ హోల్డ్ స్టాక్, అల్లాహుదీన్ పాలేకర్, బొంగానీ జీలేలు ఫిర్యాదు చేశారని చెప్పారు.

More Telugu News