Telangana: కొత్త సంసారంలో సర్దుకుపోదామని ఆగాం.. ఇక మేమేంటో చూపిస్తాం: టీఆర్ఎస్ మహాధర్నాలో మంత్రి కేటీఆర్

TRS State Wide Maha Dharna Over Demand Of Center To Procure Paddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ మహా ధర్నాలకు శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్, కరీంనగర్ లో గంగుల కమలాకర్, నర్సంపేటలో ఎంపీ మాలోతు కవిత తదితరులు ఆందోళనల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొననంటూ డ్రామాలాడుతోందన్నారు.
ఇక, సిరిసిల్లలో జరిగిన ధర్నాలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పంజాబ్ లో పండిన వడ్లను కొంటూ తెలంగాణలో పండిన ధాన్యాన్ని మాత్రమే కేంద్రం కొనమంటోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వద్దంటేనే తామూ వరి వేయొద్దంటున్నామని చెప్పారు. కేంద్రం వడ్లు కొనేదాకా ఈ ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రం వచ్చి ఏడున్నరేళ్లవుతున్నా కేంద్రం నుంచి అందిన సాయం ఏమీ లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదన్నారు. ఏపీలో కడుతున్న పోలవరానికి, కర్ణాటకలో కడుతున్న మరో ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చినా మన ప్రాజెక్టుకు మాత్రం ఇవ్వలేదన్నారు. చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి ఆయోగ్ సూచించినా.. ఐదు పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్ ఎంపీ అయిన దగ్గర్నుంచి బండి సంజయ్.. సిరిసిల్లకు చేసిందేమీ లేదని విమర్శించారు.
కొత్త రాష్ట్రం కదా అని ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, కొత్త సంసారంలో సర్దుకుపోదామన్న ఉద్దేశంతో ఆగామని, ఇకపై మనమేంటో కేంద్రానికి చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యమాలు చేసి.. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన తమకు.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం అసాధ్యమేమీ కాదన్నారు. ఉద్యమాల ద్వారా కేంద్రం దిగొచ్చేలా చేద్దామని స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన అన్నారు.

Go Back to Shorts
Telangana
TRS
KTR
Dharna
Paddy

More Telugu News