Raghu Rama Krishna Raju: నన్ను కాపాడేందుకు 'జై భీమ్'లోని 'చంద్రు' లాంటి న్యాయవాది రావాలని కోరుకుంటున్నా: రఘురామకృష్ణరాజు

  • 'జై భీమ్' చిత్రాన్ని వీక్షించిన రఘురామ
  • ఇందులో ఘటనలు తన జీవితంలోనూ ఉన్నాయని వ్యాఖ్య   
  • తనను తాను చూసుకున్నానని వివరణ
  • హీరో సూర్యతో మాట్లాడానని చెప్పిన రఘురామ
Raghurama mentions Jai Bheem movie

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆసక్తికర అంశాలు మాట్లాడారు. తమిళంలో సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ చిత్రం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సినిమా చూస్తే తన జీవితంలాగే అనిపించిందని అన్నారు. ఈ సినిమా ఇతివృత్తం తమిళనాడులోని కడలూర్ లో నిజంగానే జరిగిందని చెప్పారు.

ఓ గిరిజన యువకుడ్ని చేయని నేరానికి అరెస్ట్ చేసి ఇతరులతో కుమ్మక్కై అతడి మరణానికి కారకులవుతారని, ఆపై అతడి మృతదేహాన్ని రోడ్డుపై పడవేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారని వివరించారు.  ఈ కుట్రలో అడ్వొకేట్ జనరల్ కూడా సహకరిస్తాడని తెలిపారు. అయితే, న్యాయవాది సూర్య ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా లాకప్ లో ఏంజరిగిందో నిగ్గు తేల్చడమే ఈ 'జై భీమ్' చిత్రం అని వివరించారు.

"ఇందులో చంద్రు అనే న్యాయవాది పాత్ర నిజజీవితంలో కూడా ఉంది. చంద్రు హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయ్యాడు. రిటైర్మెంట్ రోజున తన కారు కూడా వదిలేసి ప్రజా రవాణా వ్యవస్థలో లోకల్ ట్రైన్లో ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మహానుభావుడి పాత్రనే సూర్య పోషించాడు.

ఈ సినిమాలో గిరిజన యువకుడ్ని లాకప్ లో హింసిస్తుంటే గతంలో నాకు జరిగిన అనుభవాలే గుర్తొచ్చాయి. ఇది సినిమాలాగా అనిపించలేదు. నా జీవితమే అనిపించింది. ఆ సినిమాలో గిరిజన యువకుడికి ఎంతో అన్యాయం జరిగింది. ఆ గిరిజనుడు సంగతి అటుంచితే నేనెవరిని... ఎంపీని. నాకు దిక్కులేదు. సీబీఐ విచారణ కోరుతూ మా అబ్బాయి కోర్టును ఆశ్రయించాడు. ఆర్నెల్లుగా దిక్కు లేదు. నన్ను కాపాడేందుకు చంద్రు వంటి న్యాయవాది కోసం చూస్తున్నా.

ఈ సినిమాను అందరూ చూడాలి. ఈ సినిమా చూసిన తర్వాత టాలీవుడ్ నటుడు రావు రమేశ్ నుంచి హీరో సూర్య ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడాను. నాకు సూర్యతో పరిచయం ఉంది. ఇంతకుముందు సూర్య ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండేది. కానీ నా ఫోన్ ను ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు. దాంతో ఆ నెంబర్ పోయింది. సినిమా చూసేటప్పటికి అర్ధరాత్రి అయింది. అయినప్పటికీ రావు రమేశ్ ను అడిగి సూర్య ఫోన్ నెంబర్ సంపాదించి వెంటనే నా స్పందన తెలియజేశాను. నా జీవితంపైన కూడా ఓ సినిమా తీయాలని కోరాను. జై భీమ్-2 తీస్తారేమో చూడాలి" అని అన్నారు.

More Telugu News