Deepika Padukone: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ రేసులో దీపిక, రణవీర్ జోడీ!

  • వచ్చే ఐపీఎల్ సీజన్ లో రెండు కొత్త జట్లు
  • ఇక 10 జట్లతో ఐపీఎల్ పోటీలు
  • కొత్త జట్ల కోసం బిడ్డింగ్ 
  • రేసులో బడా బాబులు
Bollywood couple in race for IPL new franchise

బంగారు బాతు వంటి ఐపీఎల్ లో వచ్చే సీజన్ లో మరో రెండు కొత్త జట్లు దర్శనమివ్వనున్నాయి. ఇకమీదట 10 జట్లతో లీగ్ నిర్వహించాలని నిర్ణయించిన బీసీసీఐ రెండు కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ప్రక్రియ షురూ చేసింది. కాగా, ఈ రెండు జట్లలో ఒక జట్టు కోసం బాలీవుడ్ దంపతులు దీపిక పదుకొణే, రణవీర్ సింగ్ కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కొత్త ఫ్రాంచైజీలో వీరిద్దరితో పాటు ఓ ప్రముఖ బిజినెస్ మేన్ కూడా భాగస్వామిగా ఉండేలా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. ఆ బిజినెస్ మేన్ అదానీ కుటుంబానికి చెందిన యువ వ్యాపారవేత్త అని టాక్ వినిపిస్తోంది.

ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో సినీ తారల పెట్టుబడులు కొత్తేమీ కాదు. కోల్ కతా నైట్ రైడర్స్ లో షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా, పంజాబ్ కింగ్స్ లో ప్రీతీ జింటా తదితరులు భాగస్వాములు. రాజస్థాన్ రాయల్స్ లో గతంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా కూడా వాటాదారులుగా కొనసాగారు.

ఇక, ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రచారంలో ఉంది. అంతర్జాతీయ ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యం కూడా ఈసారి ఐపీఎల్ రేసులో ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఐపీఎల్ కొత్త జట్లను బీసీసీఐ సోమవారం నాడు ప్రకటించనుంది.

More Telugu News