Britain: భారతీయులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన బ్రిటన్... ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్, జైరాం రమేశ్

  • బ్రిటన్ లో తాజా మార్గదర్శకాలు
  • భారత్ సహా పలుదేశాల వారికి కఠిన నిబంధనలు
  • రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్ తప్పనిసరి
  • దుర్మార్గమన్న థరూర్
  • జాతివివక్షలా అనిపిస్తోందంటూ జైరాం వ్యాఖ్యలు
Britain change its policy and Indian MPs got furious

భారత్, మరికొన్ని దేశాల నుంచి వచ్చేవారికి బ్రిటన్ తాజా నిబంధనలు ప్రకటించింది. భారత్ తో సహా పలు దేశాల ఉంచి వచ్చేవారిని వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులుగానే పరిగణిస్తామని, వారు తప్పనిసరిగా 10 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని, కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనని బ్రిటన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ రూపొందించిన కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ, తాజా జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చినవారు వ్యాక్సిన్ వేయించుకోని వారి కిందే లెక్క అని వెల్లడించింది. ఈ నిబంధనలు అక్టోబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. భారత్, టర్కీ, యూఏఈ, థాయ్ లాండ్, రష్యా, ఆఫ్రికా, దక్షిణా అమెరికా దేశాల వారికి ఇది వర్తిస్తుందని వివరించింది.

దీనిపై కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధనల కారణంగా బ్రిటన్ లో తాను అనేక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు డోసులు పొంది పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ చేయించుకున్న భారతీయులను క్వారంటైన్ లో ఉండాలని కోరడం దుర్మార్గం అని థరూర్ విమర్శించారు. కేంబ్రిడ్జ్ యూనియన్ లో తాను చర్చా కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని, తన పుస్తకం 'ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్' ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

అటు, జైరాం రమేశ్ స్పందిస్తూ, బ్రిటన్ నిర్ణయం దారుణంగా ఉందని పేర్కొన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది బ్రిటన్ లోనే అని, పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారై బ్రిటన్ కు కూడా ఎగుమతి అయిందని వివరించారు. కొవిషీల్డ్ తీసుకున్నవారిని కూడా క్వారంటైన్ లో ఉండాలనడం జాతివివక్ష నిర్ణయంగానే భావిస్తున్నామని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News