Afghanistan: అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు సభ్యులు

  • ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ టెర్రర్
  • క్రీడల పట్ల తాలిబన్ల విముఖత
  • మహిళా క్రీడాకారులకు కష్టకాలం
  • ఇప్పటికే దేశం వీడిన పలువురు
Afghan women cricketers went underground

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మళ్లీ పీఠం ఎక్కడంతో అనేక వర్గాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వారిలో క్రీడాకారులు కూడా ఉన్నారు. అనేకమంది ఆఫ్ఘన్ క్రీడాకారులు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ మహిళా క్రికెట్ జట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ను వశపరుచుకున్నప్పటి నుంచి మహిళా క్రికెటర్ల కోసం గాలిస్తున్నారు.

దీనిపై ఓ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాబూల్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మహిళా క్రికెటర్లే కాకుండా ఇతర క్రీడలకు సంబంధించిన మహిళలు ప్రస్తుతం సురక్షితంగా లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాలిబన్లు కాబూల్ లో ప్రవేశించినప్పటి నుంచి తన క్రికెట్ కిట్ దాచేశానని, ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడంలేదని వివరించింది.

తాలిబన్లు ఇప్పటికే తమను బెదిరించారని, మరోసారి క్రికెట్ ఆడితే ప్రాణాలు పోతాయని హెచ్చరించారని ఆ మహిళా క్రికెటర్ వెల్లడించింది. తమకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని, ప్రతి రోజు రాత్రివేళల్లో తమ పరిస్థితిపై చర్చించుకుంటామని వివరించింది. ప్రస్తుతానికి తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలిపింది.

కాగా, మరో మహిళా క్రికెటర్ ఆఫ్ఘన్ విడిచి వెళ్లిపోయింది. తొలుత తాలిబన్లకు చిక్కకుండా ఉండేందుకు అనేక ఇళ్లు మారిన ఆ క్రికెటర్, చివరికి దేశాన్ని వీడింది. క్రికెటర్లే కాదు, ఆఫ్ఘన్ లో మహిళా ఫుట్ బాల్ జట్టు పరిస్థితి కూడా ఇందుకు భిన్నం కాదు. వీరిలో చాలామంది ఇప్పటికే పలు యూరప్ దేశాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

More Telugu News