America: అమెరికాలో ఇడా తుపాను బీభత్సం.. ఇద్దరు తెలుగువారు సహా నలుగురు భారతీయ అమెరికన్ల మృతి

  • ఇడా తుపాను కారణంగా ఇప్పటి వరకు 65 మంది బలి
  • కారులో వెళ్తుండగా వరదలో చిక్కుకుపోయిన మాలతి
  • మురుగు కాల్వ పైపులోకి జారిపోయిన ధనుష్‌రెడ్డి
  • మరో ఘటనలో భర్త కళ్లముందే కొట్టుకుపోయిన భార్య, కుమారుడు
Four Indians including two Telugu people died in America ida cyclone

అమెరికాలో ఇడా తుపాను సృష్టించిన బీభత్సానికి నలుగురు భారతీయ అమెరికన్లు బలయ్యారు. న్యూజెర్సీలోని బ్రిడ్జ్‌వాటర్ టౌన్‌షిప్‌లో మాలతి కంచె (46), సౌత్‌ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ధనుష్ రెడ్డి (31) వరద నీటిలో కొట్టుకుపోయి మరణించారు. వీరిద్దరూ తెలుగువారిగా భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ డిజైనర్ అయిన మాలతి తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి బుధవారం కారులో వెళ్తుండగా నీటిలో చిక్కుకుపోయారు. దీంతో వారు వెంటనే కారు దిగి బయటకు వచ్చి పక్కనే ఉన్న చెట్టును పట్టుకున్నారు. అయితే వరద ప్రవాహం పెరిగి చెట్టు కూలడంతో మాలతి గల్లంతయ్యారు. శుక్రవారం ఆమె మృతదేహం లభ్యమైంది.

మరో ఘటనలో మురుగు పైపులోకి జారిపోవడం ద్వారా ధనుష్‌రెడ్డి మరణించారు. 8 కిలోమీటర్ల దూరంలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఇంకో ఘటనలో న్యూయార్క్‌లో దామేశ్వర్ రామ్స్ క్రీట్స్ భార్య తారా రామ్స్‌క్రీట్స్, ఆయన 22 ఏళ్ల కుమారుడు నిక్ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. భార్యను రక్షించేందుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తన కళ్లముందే వారిద్దరూ కొట్టుకుపోయారని దామేశ్వర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఇడా తుపానులో ఇప్పటి వరకు 65 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News