కేసీఆర్‌వి దోపిడీ ప్రణాళికలు.. విరుచుకుపడిన మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్

Devendra Fadnavis fires on Telangana chief minister
  • వికారాబాద్ చేరిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ్ పాదయాత్ర
  • రైతులతో రచ్చబండ
  • కేసీఆర్ ఆలోచనలన్నీ కుమారుడు, కుమార్తె, కుటుంబం కోసమేనన్న ఫడ్నవీస్
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఇంటి రాబోనని కుటుంబ సభ్యులను ఒప్పించానన్న బండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ్ పాదయాత్రలో భాగంగా నిన్న వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేట సమీపంలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మాట్లాడిన ఫడ్నవీస్.. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కూర్చుని దోపిడీకి సంబంధించిన ప్రణాళికలు రచిస్తుంటారని ఆరోపించారు. ఆయన ఆలోచనలన్నీ తన కుమారుడు, కుమార్తె, కుటుంబం కోసమేనని దుయ్యబట్టారు.

బండి సంజయ్ రైతుల మధ్య కూర్చుని వారి సమస్యలు తెలుసుకుంటున్నారని, కేసీఆర్ ఎప్పుడైనా ఇలా చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం, ప్రజాస్వామ్య పాలన రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, అది జరగాలంటే బండి సంజయ్ యాత్రను ఆశీర్వదించాలని కోరారు. ఆ తర్వాత ఎన్నెపల్లె చౌరస్తాలో కాసేపు మాట్లాడిన ఫడ్నవీస్.. కొంతమంది భారతదేశంలోనే ఉంటూ, దేశ రాజ్యాంగాన్ని అనుమతించడం లేదంటూ పరోక్షంగా ఎంఐఎంపై నిప్పులు చెరిగారు. ‘కారు’ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు.

వికారాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రాం చౌరస్తాలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఫడ్నవీస్ 70 వేళ ఇళ్లు నిర్మించి ఇచ్చారని, మన రాష్ట్రంలో ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చే వరకు ఇంటికి రాబోనని కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ప్రజా క్షేత్రంలోకి దిగినట్టు చెప్పారు.
Go Back to Shorts
Telangana
Bandi Sanjay
BJP
Devendra Fadnavis

More Telugu News