Tokyo Pralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. డిస్కస్ త్రోలో యోగేశ్‌కు రజతం

  • పారాలింపిక్స్‌లో పోటీపడి పతకాలు సాధిస్తున్న భారత అథ్లెట్లు
  • భారత్‌కు నేడు నాలుగు పతకాలు
  • పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇన్ని పతకాలు ఇదే తొలిసారి
Indias Yogesh Kathuniya wins silver in Mens Discus throw F56

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం కురుస్తోంది. భారత అథ్లెట్లు పోటీలు పడి పతకాలు సాధిస్తున్నారు. ఈ ఉదయం భారత షూటర్ అవనీ లేఖర దేశానికి తొలి స్వర్ణ పతకం అందించగా, తాజాగా డిస్కస్‌త్రోలో యోగేశ్ కతునియా పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56లో రజత పతకం అందించాడు. 44.38 మీటర్లు విసిరి ఈ సీజన్‌లోనే బెస్ట్ సాధించాడు. 24 ఏళ్ల యోగేశ్ ఈ కేటగిరీలో ప్రపంచ నంబర్ 2గా కొనసాగుతున్నాడు. బ్రెజిల్ క్రీడాకారుడు క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

అలాగే, జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. దేవేంద్ర జజారియా రజత పతకం గెలుచుకోగా, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు సొంతమయ్యాయి. కాగా, నిన్న డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించినప్పటికీ ఈ విషయంలో నేడు స్పష్టత రానుంది. ఇది కూడా కలిస్తే భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకున్నట్టే. పారాలింపిక్స్‌లో భారత్ ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి.

More Telugu News