Haryana: రైతులపై దాడి చేయించిన అధికారిపై చర్యలు: స్పష్టం చేసిన హర్యానా డిప్యూటీ సీఎం

  • ‘‘తలలు పగలగొట్టండి’’ అంటూ కెమెరాకు చిక్కిన ఎస్‌డీఎం
  • ఆయుష్ సిన్హా తీరుపై పలువురు నేతల ఆగ్రహం
  • చర్యలు తప్పవన్నడిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా
Actions against the officer who attacked the farmers Haryana CM clarified

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హర్యానాలో కొందరు రైతులు నిరసనలు చేస్తుండగా.. వారిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆ సమయంలో చేతిలోని లాఠీలు విరిగేలా రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సదరు పోలీసులను వెనుకనుంచి రెచ్చగొట్టిన అధికారికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కర్నల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) హోదాలో ఉన్న ఆయుష్ సిన్హా.. తన కింది అధికారులకు రైతులపై దాడి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఈ దాడిలో పదిమందికిపైగా రైతుల తలలకు తీవ్రమైన గాయాలయ్యాయి. పోలీసులను రైతులపై ఉసిగొల్పుతున్న అధికారి వీడియో వైరల్ కావడంతో అతనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోలో ఆయుష్.. ‘‘తలలు పగలగొట్టండి’’ అంటూ తన కింది అధికారులకు ఆదేశాలివ్వడం స్పష్టంగా వినపడుతోంది. ఆయుష్ తీరును పలువురు నేతలు ఖండించారు. వీరిలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఉన్నారు. ఈ క్రమంలో హర్యానా డిప్యూటీ ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కూడా స్పందించారు. సదరు అధికారిపై కచ్చితంగా చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. రెండ్రోజులుగా నిద్రలేదని, అందుకే కోపంలో అలా అన్నానని ఆయుష్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. అయితే రైతులు 365 రోజులుగా నిద్రలేకుండా నిరసనలు చేస్తున్నారని, ఈ విషయం ఆయన గ్రహించాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

More Telugu News