Huzurabad: ద‌ళిత బంధు కోసం హుజూరాబాద్‌లో ఎస్సీల ఆందోళ‌న‌.. భారీగా నిలిచిపోయిన వాహ‌నాలు

  • ల‌బ్ధిదారుల జాబితాలో త‌మ పేర్లు లేవ‌ని ఆందోళ‌న‌
  • కొంద‌రికి మాత్ర‌మే రూ.10 ల‌క్ష‌లు ఇస్తున్నార‌ని ఆగ్ర‌హం
  • వరంగ‌ల్-కరీంన‌గ‌ర్ ర‌హ‌దారిపై వాహ‌నాలు నిలిచిపోయిన వైనం

హుజూరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16న దళితబంధు పథకాన్ని పైల‌ట్ ప్రాజెక్టు కింద‌ అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేశారు. హుజూరాబాద్‌లోనే ఉంటూ దళిత బంధు కార్యక్రమం ప్రారంభోత్స‌వ‌ ఏర్పాట్లను తెలంగాణ‌ మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

దళిత బంధు పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు కోసం రూ.500 కోట్లు విడుదలయ్యాయి. అయితే, ఈ ప‌థ‌కం ల‌బ్ధిదారులుగా కొంద‌రిని మాత్ర‌మే ఎంపిక చేయ‌డం ప‌ట్ల హుజూరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దళితులు ఆందోళన బాట ప‌ట్టారు.

ప‌లు చోట్ల‌ అధికారుల నుంచి ద‌ళిత బంధు ల‌బ్ధిదారుల‌ జాబితాను తీసుకుని చించేశారు. హుజూరాబాద్ పెద్ద‌పాప‌య్య ప‌ల్లి క్రాస్ రోడ్, అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ఈ రోజు ఎస్సీలు పెద్ద ఎత్తున‌ ఆందోళ‌న చేప‌ట్టారు. ద‌ళిత బంధు అంద‌రికీ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఎస్సీల ఆందోళ‌న‌ల‌తో వరంగ‌ల్-కరీంన‌గ‌ర్ ర‌హ‌దారిపై వాహ‌నాలు నిలిచిపోయాయి.

More Telugu News