England: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు: సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్

  • రోహిత్-రాహుల్ తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం
  • సెంచరీ ముంగిట అవుటైన రోహిత్
  • మరోమారు నిరాశపరిచిన పుజారా
  • తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 276/3
England vs India 2nd test kl rahul century

ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. లార్డ్స్‌లో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం 1952 తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో వినూ మన్కడ్-పంకజ్ రాయ్ ఈ ఘనత సాధించారు. అలాగే, టెస్టుల్లో రోహిత్-రాహుల్ తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించడం ఇది రెండోసారి.

తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన రోహిత్ ఆ తర్వాత జోరు పెంచాడు. వరస ఫోర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 145 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 83 పరుగులు చేసిన రోహిత్.. సెంచరీ ముంగిట జేమ్స్ అండర్సన్ బౌలింగులో బౌల్డయ్యాడు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో భారత జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. చతేశ్వర్ పుజారా మరోమారు తీవ్రంగా నిరాశపరచగా, కెప్టెన్ కోహ్లీ 42 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగులో వెనుదిరిగాడు.

అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్న రాహుల్ ఆ తర్వాత సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.  తొలి వంద బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ ఆ తర్వాత 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం మరో 75 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం గమనార్హం. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.  రాహుల్ (127), రహానే (1) క్రీజులో ఉన్నారు.

More Telugu News