WHO: కరోనా డెల్టా వేరియంట్ విజృంభ‌ణ‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న

  • దాని ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ముప్పు
  • డెల్టా వేరియంట్ లాంటి మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకువ‌స్తాయి
  • వైర‌స్‌ క‌ట్ట‌డి చర్యలు చేపట్టాలి
  • ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి  
who on delta varient

కరోనా డెల్టా వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. దాని ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే పెనుముప్పు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఈ వేరియంట్ విజృంభ‌ణ‌తో ఆయా దేశాల్లో మ‌ళ్లీ  క‌రోనా వ్యాప్తి తీవ్ర‌త‌ర‌మైంది.

దీనిపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ స్పందిస్తూ డెల్టా వేరియంట్‌ మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకురాక‌ముందే క‌రోనా వైర‌స్‌ను నియంత్రించాల‌ని డెల్టా విజృంభిస్తోన్న తీరు హెచ్చ‌రిస్తోంద‌ని చెప్పారు.

కొవిడ్-19ను పూర్తిగా క‌ట్ట‌డి చేసేందుకు శ‌ర‌వేగంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటి వరకు నాలుగు ఆందోళనకర వేరియంట్లు వెలుగులోకి వచ్చాయన్నారు. క‌రోనా ఇలాగే రూపాంతరం చెందుతూపోతుంటే మరిన్ని ప్రమాదకరమైన వేరియంట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. గత నాలుగు వారాల్లో సగటున 80 శాతం కేసులు పెరిగాయని ఆయ‌న చెప్పారు.

ఇక ఇదే విష‌యంపై డబ్ల్యూహెచ్‌ఓ ఎమ‌ర్జెన్సీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్ స్పందిస్తూ.. ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వైర‌స్ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంద‌ని, అయితే, ప‌లు ప్రాంతాల్లో కరోనా నిబంధనలు వైర‌స్ వ్యాప్తిని అడ్డుకుంటున్నాయ‌ని చెప్పారు.

వ్యాక్సినేషన్‌ సమర్థంగా పనిచేస్తోందని, అంద‌రూ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. పేద దేశాలకు అవ‌స‌ర‌మైన మేర‌కు వ్యాక్సిన్ అంద‌క‌పోతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని డబ్ల్యూహెచ్‌వో మ‌రోసారి ఆందోళన వ్య‌క్తం చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులోగా ప్ర‌పంచంలోని ప్రతి దేశం జనాభాలో కనీసం 10 శాతం మందికైనా వ్యాక్సిన్లు ఇవ్వాల్సిందేన‌ని పేర్కొంది.

అలాగే, డిసెంబ‌రు నాటికి 40 శాతం మందికి, వచ్చే ఏడాది జూన్ నాటికి 70 శాతం మందికి వ్యాక్సిన్లు అందేలా చర్యలు చేపట్టాలని, అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమ‌ని అనిపిస్తోంద‌ని చెప్పింది. డబ్ల్యూహెచ్‌ఓ సభ్య దేశాల్లో కేవలం సగం దేశాల్లో మాత్రమే జనాభాలో 10 శాతం మందికి పూర్తిస్థాయి డోసులు అందాయ‌ని తెలిపింది.

More Telugu News