Raghu Rama Krishna Raju: తిరుమల వీడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: రఘురామకృష్ణరాజు వ్యవహారంపై టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి

  • ఆర్మీ ఆసుపత్రిలో తనపై కుట్ర జరిగిందన్న రఘురామ 
  • దీనికి ధర్మారెడ్డి సహకరించారని ఆరోపణ
  • ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్‌ కె.పి.రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారని వాదన
  • ఆరోపణల్ని కొట్టిపారేసిన ధర్మారెడ్డి
ttd jeo dharma reddy response on RRR issue allegation

తనను త్వరగా డిశ్చార్జి చేయించి మళ్లీ అరెస్టు చేయించేందుకు ఆర్మీ ఆసుపత్రిలో కుట్ర జరిగిందంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు రక్షణ శాఖ ఉద్యోగి.. ప్రస్తుతం డిప్యుటేషన్ పై ఏపీ ప్రభుత్వంలో టీటీడీ జేఈవోగా పని చేస్తున్న ధర్మారెడ్డి సహా మరికొంత మంది సహకరించారని రఘురామ ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్‌ కె.పి.రెడ్డిని ప్రభావితం చేసేందుకు ధర్మారెడ్డి హైదరాబాద్‌ వచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై తాజాగా ఓ న్యూస్ చానెల్ యాంకర్ ఫోన్లో అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి స్పందించారు. తాను హైదరాబాద్‌ వచ్చానని చెబుతున్న తేదీల్లో తిరుమలలోనే ఉన్నానని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మే 3 నుంచి 18 వరకు తాను సుందరకాండ దీక్షలో ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత కూడా తాను తిరుమల విడిచి వెళ్లలేదన్నారు.

ఒకవేళ తాను తిరుమల దాటి వెళ్లినట్లు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్‌ విసిరారు. కె.పి.రెడ్డికి, తనకూ ఎలాంటి పరిచయం లేదన్నారు. అవసరమైతే గత మూడు సంవత్సరాల కాల్‌ రికార్డింగ్స్‌ చూసుకోవచ్చన్నారు.

More Telugu News