Telangana: కాసేప‌ట్లో కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ పొడిగించకూడ‌ద‌ని అస‌దుద్దీన్ ఒవైసీ డిమాండ్

  • క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ ప‌రిష్కారం కాదు
  • సాయంత్రం 6 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ విధించాలి
  • రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉన్నారు
  • కేవ‌లం నాలుగు గంట‌ల లాక్‌డౌన్‌ స‌డ‌లింపు స‌రికాదు
  • క‌రోనా క‌ట్ట‌డిని శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మార్చ‌కూడ‌దు
AIMIM chief Asaduddin Owaisi on cabinet meet

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైద‌రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ కాసేప‌ట్లో స‌మావేశం కానుంది. లాక్‌డౌన్ ఎత్తివేత లేదా పొడిగింపు అంశంపై నిర్ణ‌యం తీసుకోనుంది. అలాగే, రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం, పంటల సాగు, ఇంటింటి జ్వర సర్వే, బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స, ఔషధాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా చికిత్స కోసం వైద్య, ఆరోగ్య శాఖకు అదనపు నిధులు కేటాయించాల్సిన అంశంపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ట్విట్ట‌ర్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ రోజు కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. లాక్‌డౌన్ పొడిగించ‌వ‌ద్ద‌ని అన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ ప‌రిష్కారం కాదని, జ‌న స‌మూహాల‌ను త‌గ్గించాలంటే సాయంత్రం 6 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ విధించాల‌ని చెప్పారు. కొవిడ్ కేసులు ఉన్న‌చోట మినిలాక్‌డౌన్ పెట్టాల‌ని సూచించారు.

రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్ర‌జ‌లు కేవ‌లం నాలుగు గంట‌ల లాక్‌డౌన్‌ స‌డ‌లింపు స‌మ‌యంలో అన్ని ప‌నుల‌ను చూసుకోలేర‌ని ఆయ‌న చెప్పారు. లాక్‌డౌన్ కార‌ణంగా కేసులు త‌గ్గ‌లేద‌ని, రాష్ట్రంలో అంత‌కు ముందు నుంచే కేసులు త‌గ్గుముఖం ప‌ట్టడం ప్రారంభ‌మ‌యింద‌ని చెప్పుకొచ్చారు. క‌రోనా, పేద‌రికం, పోలీసుల వేధింపుల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని అన్నారు. క‌రోనా క‌ట్ట‌డిని శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మార్చ‌కూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు.


More Telugu News