Bharat: ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజును కలిసిన తనయుడు భరత్

  • ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామ
  • పరామర్శించిన కుమారుడు
  • న్యాయవాది కూడా ఆసుపత్రికి వెళ్లిన వైనం
  • రఘురామ బెయిల్ ఆర్డర్ రేపు వచ్చే అవకాశం
Bharat met his father Raghurama Krishna Raju in army hospital in Secunderabad

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఆయన తనయుడు భరత్ పరామర్శించారు. ఆయనతో పాటు రఘురామ న్యాయవాది కూడా ఆసుపత్రికి వెళ్లారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిపై భరత్ ఆర్మీ డాక్టర్లతో మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం రఘురామపై రాజద్రోహం ఆరోపణలు మోపడంతో ఇటీవల ఆయనను సీఐడీ అధికారులు ఆరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, కస్టడీలో తన పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ రఘురామ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కాలికి గాయాలు అయ్యాయంటూ మీడియాకు కూడా ప్రదర్శించారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తీవ్రస్థాయిలో వాదోపవాదాల అనంతరం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కోర్టులో రూ.1 లక్ష పూచీకత్తు సమర్పించాలని, ఇద్దరు హామీదార్ల పేర్లను జోడించాలని, అప్పుడే కింది కోర్టు బెయిల్ ఆర్డర్ జారీ చేస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ఇవాళ రఘురామను కలిసిన న్యాయవాది అవసరమైన లాంఛనాలు పూర్తిచేసినట్టు తెలుస్తోంది. రేపు సీఐడీ కోర్టులో ఆ మేరకు పత్రాలు సమర్పించి బెయిల్ ఆర్డర్ పొందనున్నారు. అనంతరం, సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి నుంచి రఘురామ డిశ్చార్జి అవుతారు.

More Telugu News