Raghu Rama Krishna Raju: గుంటూరు జైలు నుంచి రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించిన సీఐడీ

  • రఘురామ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు
  • సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో టెస్టులు చేయించాలని వెల్లడి
  • గుంటూరు జైలు నుంచి వెలుపలికి వచ్చిన రఘురామ
  • రెండు చేతులెత్తి అందరికీ అభివాదం
  • భారీ భద్రత నడుమ సికింద్రాబాద్ పయనం
Police has taken Raghurama Krishna Raju to Secunderabad Army Hospital

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణరాజును ఈ సాయంత్రం గుంటూరు జైలు నుంచి ఆయన సొంత వాహనంలోనే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి కిందటే రఘురామ జైలు నుంచి వెలుపలికి వచ్చి వాహనంలో ఎక్కారు. ఈ సందర్భంగా రఘురామ కొద్దిగా భావోద్వేగాలకు గురై, అందరికీ చేతులెత్తి అభివాదం చేశారు.

సికింద్రాబాద్ తరలింపు సందర్భంగా భారీ భద్రతతో కాన్వాయ్ బయల్దేరింది. ఆయన వాహనానికి పోలీసు ఎస్కార్ట్ తో పాటు సీఆర్పీఎఫ్ రక్షణ కూడా కల్పించారు. రాత్రి 10 గంటలకు ఆయన సికింద్రాబాద్ చేరుకుంటారని భావిస్తున్నారు.  

ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని, రెండు చానళ్లతో కలిసి కుట్ర చేస్తున్నారని రఘురామపై అభియోగాలు మోపుతూ ఏపీ సీఐడీ ఈ నెల 14న అరెస్ట్ చేసింది. ఈ మధ్యలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పోలీసులు తనను దారుణంగా కొట్టినట్టు రఘురామ ఆరోపించగా, ఆయనకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రమేశ్ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఆ ఆదేశాలు అమలు కాలేదంటూ కొంత వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కొద్దిమేర ఊరట కలిగిందని చెప్పవచ్చు. అయితే, ఆర్మీ ఆసుపత్రి వైద్యుల నివేదిక ఎలా ఉండబోతోందన్న విషయం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News