Telangana: వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలి: సీఎం కేసీఆర్‌

  • కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయాలు
  • వైద్య సిబ్బందిపై భారం తగ్గించాలని సూచన
  • యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపు
  • ఆసక్తి ఉన్న ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన విద్యార్థులకు సైతం అవకాశం
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ
CM Kcr takes key decision in the wake of corona

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బందిపై భారం తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని అధికారులకు సూచించారు. కరోనా వల్ల దుర్భర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజా సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారున్నారని.. ఆసక్తి ఉన్నవారంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈరోజు ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సినన్ని బెడ్లు, ఔషధాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఇక వరంగల్‌ ఆదిలాబాద్‌ జిల్లాల్లో వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు తెరవాలని ఆదేశించారు. అందుకు కావాల్సిన సిబ్బందిని సైతం తక్షణమే నియమించుకోవాలని సూచించారు. అలాగే వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న వర్గాలకు వీలైనంత త్వరగా టీకాలు ఇవ్వాలని సూచించారు. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. కరోనా కట్టడికి పలు సూచనలు చేయగా.. ప్రధాని మోదీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు.

More Telugu News