Corona Virus: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌

  • లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా నష్టం
  • కొన్ని రాష్ట్రాల్లో విధించినా వ్యాప్తి ఆగలేదు
  • రాష్ట్రానికి కావాల్సిన వైద్య సరఫరాలపై మోదీకి విజ్ఞప్తి
  • రోజుకి రాష్ట్రంలో 2-2.5 లక్షల టీకాల అవసరం
  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ చర్చలు  
wont impose lockdown in the state

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల ప్రజా జీవనం స్తంభించిపోతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత అనుభవాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కూడా కరోనా ఉద్ధృతి తగ్గడం లేదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్లు, రెమ్‌డెసివిర్‌ సరఫరాల గురించి ప్రధాని మోదీతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. వాటిని తక్షణమే రాష్ట్రానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌, కర్ణాటకలోని బళ్లారి నుంచి కేటాయించిన ఆక్సిజన్‌ అందడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.  తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు రావడం వల్ల భారం పెరిగిందని ప్రధానికి తెలియజేశారు.

రాష్ట్రానికి ప్రస్తుతం 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుతోందని..  దానిని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. అలాగే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు 4900 మాత్రమే అందుతున్నాయని.. వాటిని 25 వేలకు పెంచాలని కోరారు. మరోవైపు కేంద్రం ఇప్పటి వరకు 50 లక్షల కరోనా టీకా డోసుల్ని అందించిందని తెలిపారు. రాష్ట్రంలో రోజుకి 2-2.5 లక్షల డోసుల అవసరం ఉందన్నారు. వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో కేసీఆర్‌ మాట్లాడారు. ప్రధాని మోదీకి విన్నవించిన అంశాలన్నింటినీ తక్షణమే తెలంగాణకు సమకూరుస్తామని గోయల్‌ హామీ ఇచ్చారు. ఆక్సిజన్‌ కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి అందేలా చూస్తామన్నారు.

More Telugu News