Australia: ఐపీఎల్ నిలిచిపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఆస్ట్రేలియన్లు!

Australians faces strange situations after IPL postponed
  • భారత్ లో కరోనా కల్లోలం
  • ఐపీఎల్ క్రికెటర్లకు కూడా కరోనా పాజిటివ్
  • నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ తాజా సీజన్
  • వివిధ ఐపీఎల్ జట్లలో 40 మంది వరకు ఆస్ట్రేలియన్లు
  • ఆశాదీపంలో మాల్దీవులు
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పెద్ద సంఖ్యలో ఆడుతున్నారు. వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, కామెంటేటర్లతో కలిపి దాదాపు 40 మంది వరకు ఆస్ట్రేలియన్లు ఉంటారు. అయితే, పలువురు క్రికెటర్లు కరోనా బారినపడుతుండడంతో ఐపీఎల్ అర్ధంతరంగా నిలిచిపోయింది. భారత్ లోనే ఉండిపోదామంటే మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. అటు ఆస్ట్రేలియా వెళ్లేందుకు విమానాలు లేవు. భారత్ నుంచి ఆస్ట్రేలియా వస్తే జైలు శిక్షేనంటూ ప్రధాని స్కాట్ మారిసన్ చేసిన ప్రకటనతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ నేపథ్యంలో వారికి మాల్దీవులు చిరు ఆశలు కల్పిస్తోంది. మొదట భారత్ నుంచి మాల్దీవులు చేరుకుంటే, అక్కడి నుంచి స్వదేశం వెళ్లే మార్గం ఆలోచించవచ్చని ఆస్ట్రేలియా క్రికెటర్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ భారత్ ను వీడి మాల్దీవులు చేరుకున్నాడు. ఇప్పుడతడి బాటలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాల్దీవుల బాటపట్టే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం లేకపోయినా, కనీసం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత్ నుంచి దూరంగా వెళ్లొచ్చన్న భావనలో వారిలో కలుగుతోంది.

భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలు మే 15 వరకు నిషేధించిన నేపథ్యంలో, ఆసీస్ ఆటగాళ్లకు కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి పరిస్థితి తమకు ఎప్పుడూ ఎదురుకాలేదని కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించే ప్యాట్ కమిన్స్ వాపోయాడు. గతంలో ఆస్ట్రేలియాను వీడితే తిరిగొచ్చేటప్పుడు 14 రోజుల క్వారంటైన్ నిబంధన ఉండేదని, ఇప్పుడు అందుకు కూడా అనుమతించడంలేదని విచారం వ్యక్తం చేశాడు.
Australia
Cricketers
Staff
Comentators
IPL
Corona Virus
India

More Telugu News