Jagadish Khattar: మారుతీ సుజుకి మాజీ ఎండీ ఖట్టర్ కన్నుమూత

  • ఈ ఉదయం గుండెపోటుతో మృతి
  • ఖత్తర్ వయసు 79 సంవత్సరాలు
  • 1993లో మారుతి సంస్థలో డైరెక్టర్ గా ప్రవేశం
  • అంచెలంచెలుగా ఎదిగిన వైనం
Maruti Suzuki former MD Jagadish Khattar dies of heart attack

కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి మాజీ ఎండీ జగదీశ్ ఖట్టర్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. జగదీశ్ ఖట్టర్ 1993లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ లో డైరెక్టర్ (మార్కెటింగ్)గా చేరిన కొన్ని సంవత్సరాల్లోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. అయితే, 1999లో సుజుకి మోటార్ కార్పొరేషన్ కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు పొడసూపిన తరుణంలో ఖట్టర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆపై ఎండీగా బాధ్యతలు స్వీకరించి మారుతీ సంస్థను ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు.

ఖట్టర్ ఐఏఎస్ అధికారి. మారుతి సుజుకి సంస్థలో ప్రభుత్వ పెట్టుబడులు ఉండడంతో ఆయనకు ఆ సంస్థలో ఉన్నత పదవి లభించింది. అయితే 2002లో కేంద్ర ప్రభుత్వం సుజుకి కార్పొరేషన్ తో ఒప్పందాన్ని తెగదెంచుకుంది. దాంతో మారుతి సంస్థను తన సత్తాతో కొద్దికాలంలోనే లాభాల బాట పట్టించారు. ఖట్టర్ 2007లో ఎండీగా పదవీ విరమణ చేశారు. మారుతి నుంచి రిటైరైన తర్వాత ఓ చెయిన్ సంస్థను ఏర్పాటు చేసి సీబీఐ కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా, ఖట్టర్ మృతితో భారత ఆటోమొబైల్ రంగంలో విషాదం నెలకొంది.

More Telugu News