Supreme Court: సుప్రీంకోర్టు ముందే స్పందించి ఉంటే పరిస్థితి ఈ స్థాయికి దిగజారేది కాదు: సుప్రీంకోర్టుపై శివసేన వ్యాఖ్యలు

  • కొవిడ్‌ కట్టడిపై న్యాయస్థానం ముందే స్పందించాల్సింది
  • బెంగాల్‌లో ర్యాలీలు, కుంభమేళాను ఆపాల్సింది
  • కేంద్ర ప్రభుత్వ దృష్టంతా ఎన్నికలపైనే
  • మహమ్మారి కట్టడిపై ఆలోచించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు
  • సామ్నాలో శివసేన విసుర్లు
Supreme court would have acted sooner

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలు, హరిద్వార్‌లో జరిగిన కుంభమేళా గురించి సుప్రీంకోర్టు సకాలంలో స్పందించి ఉంటే దేశంలో కొవిడ్-19 పరిస్థితి మరీ ఈ స్థాయికి దిగజారి ఉండేది కాదని శివసేన అభిప్రాయపడింది. కొవిడ్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఓ జాతీయ విధానాన్ని ప్రకటించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘ఇప్పటికైనా కోర్టు జోక్యం చేసుకోవడంతో మంచి జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా రోడ్డు షోలు, ప్రచార ర్యాలీలు.. హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాపై కోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకొని ఉంటే ప్రజలు ఇంత వేదనలో మరణించి ఉండేవారు కాదు’’ అని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో రాసుకొచ్చింది.

ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరతతో 25 మంది రోగులు చనిపోయారన్న వార్తను ఈ సందర్భంగా ప్రస్తావించిన శివసేన.. ఈ పరిస్థితికి కేంద్రం కాక మరెవరు బాధ్యులని ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై మాత్రమే కాకుండా కొవిడ్‌ను ఎదుర్కోవడంపై కూడా కేంద్రం దృష్టి సారించి ఉంటే పరిస్థితి ఈ స్థాయికి దిగజారి ఉండేది కాదని సేన అభిప్రాయపడింది.

మోదీ, ఆయన సహచరులు దేశాన్ని స్వర్గంలా మార్చాలనుకున్నారని.. కానీ, దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చితి మంటలు, శ్మశానాలే దర్శనమిస్తూ నరకాన్ని తలపిస్తున్నాయని సేన వ్యాఖ్యానించింది. మరోవైపు పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. దేశ నాయకత్వం ఎన్నికల్లో విజయాలు, రాజకీయాలను దాటి పోవాలనుకోవడం లేదని ఆరోపించారు. దీన్నే బీజేపీ అంతిమ విజయంగా భావిస్తున్నారన్నారని అభిప్రాయపడ్డారు. మహమ్మారి నిరోధంపై దృష్టి సారించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదని తెలిపారు.

More Telugu News