Proning: శ్వాస బాగా ఆడాలంటే... ఏం చేయాలో కేంద్రం సిఫార్సులు!

  • రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు
  • వైద్య పరంగానూ ఆమోదం పొందిన 'ప్రోనింగ్'
  • పడక మార్పులతో మెరుగైన శ్వాస పొందే అవకాశం
Center Recomends Proning for Citizens

రోజురోజుకూ ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కొరతతో పాటు, మహమ్మారి సోకిన వారికి అవసరమైన మందులు కూడా లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో, వ్యాధి సోకిన వారు   శ్వాస సక్రమంగా ఆడేలా స్వీయ చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం 'ప్రోనింగ్' విధానాన్ని పాటించాలని సిఫార్సు చేసింది. మరింత సులువుగా శ్వాస ఆడటంతో పాటు, శరీరానికి అవరమైన ఆక్సిజన్ స్థాయిని ఈ విధానం పెంచుతుందని, దీన్ని వైద్య పరంగానూ ఆమోదించారని పేర్కొంది.

ఇక ఈ విధానంలో తొలుత బోర్లా పడుకోవాల్సి వుంటుంది. కడుపు మంచంపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుని, ముఖం బోర్లా పెట్టి 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు  పడుకోవాల్సి వుంటుంది. దీంతో శ్వాస పీల్చుకోవడం సులువవుతుంది. ఈ ప్రక్రియ శరీరంలో ఆక్సిజన్ స్థాయి 94 శాతానికి మించి తగ్గినప్పుడు మాత్రమే చేయాలి. ఆ తరువాత కుడివైపునకు, ఎడమ వైపునకు తిరిగి పడుకుంటూ సాధ్యమైనంత సమయం ఉండాలని, ఇది చేస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, బ్లడ్ షుగర్ కూడా  చెక్ని చేసుకుంటూ ఉండాలి. హోమ్ ఐసొలేషన్ లో ఉండే వారికి 'ప్రోనింగ్' ప్రక్రియ చాలా ముఖ్యమని తెలిపింది.

సమయానుసారంగా ప్రోనింగ్ చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియకు నాలుగు పిల్లోలను వాడాలని, ఒకటి మెడ కింద, రెండు గుండెల కింద, ఆపై మోకాళ్ల కింద పెట్టుకుంటే, మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలిపింది. అయితే, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణీలు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఈ విధానాన్ని పాటించరాదని తెలిపింది. భోజనం చేసిన వెంటనే కూడా ఈ ప్రక్రియ చేయరాదని సూచించింది. ప్రోనింగ్ విధానానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

More Telugu News