Varla Ramaiah: వివేకా హత్య కేసులో చెల్లెలి ఆవేదన చూసైనా రహస్యాన్ని జగన్ బహిర్గతం చేయాలి: వర్ల రామయ్య

  • వివేకా హత్య జరిగి రెండేళ్లు
  • నిన్న ఢిల్లీలో వివేకా కుమార్తె సునీత ప్రెస్ మీట్
  • తన తండ్రిని చంపింది ఎవరంటూ ఆవేదన
  • సునీత ఆక్రందనలు తనను కదిలించాయన్న వర్ల రామయ్య
  • జగన్ హృదయం కరగడం లేదా? అంటూ వ్యాఖ్యలు
Varla Ramaiah press meet on Viveka murder issue

తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ డాక్టర్ సునీతారెడ్డి హస్తినాపుర వీధుల్లో ఆర్తనాదాలు చేస్తోందని, ఆమె ఆక్రందనలు సీఎం జగన్ కు వినిపించడం లేదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. తన తండ్రిని చంపింది ఎవరో తెలియడంలేదంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతోందని, ఆమె దయనీయ పరిస్థితి మీకు అర్థం కావడంలేదా? నిలదీశారు.

"నాకు తెలిసినంతవరకు ఇవాళ సీఎం జగన్ కు కార్యక్రమాలు ఏవీ లేవు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఆయన నా మీడియా సమావేశాన్ని చూడాలి. తెలంగాణలో రాజకీయాలు అంటూ తిరుగుతున్న మీ సొంత చెల్లెలు షర్మిలతో మీకు సఖ్యత చెడిందని విన్నాను. మీ తల్లి గారితోనూ మీకు సరైన సంబంధాలు లేవని వింటున్నాను. కానీ నిన్న మీ మరో చెల్లెలు సునీతారెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కదిలిపోయాను. ఆమె హిందీలో మాట్లాడింది, తెలుగులో మాట్లాడింది ఇంగ్లీషులో మాట్లాడింది. మా నాన్నను చంపింది ఎవరు అంటూ దీనంగా మాట్లాడిన తీరు చూస్తే కరడుగట్టిన కర్కశ హృదయాలు సైతం కరిగి నీరవ్వాల్సిందే. ఏం మీ హృదయాలు కరగడంలేదా జగన్ గారూ?

రెండేళ్ల కిందట పులివెందుల రాజకోటలో జరిగిన రహస్యం ఏంటి? 2019 మార్చి 15న తెల్లవారుజామున ఏంజరిగింది? అందరివాడితో మంచివాడనిపించుకున్న మీ బాబాయిని చంపింది ఎవరో ఆ రహస్యాన్ని బట్టబయలు చేయండి సార్. ఆ రహస్యం మీకు తెలుసని మీ చెల్లే అంటోంది. ఆ రహస్యం మీకు తెలుసని నాకూ తెలుసు. అందుకే మీరు సీబీఐ ఎంక్వైరీ కావాలన్నారు. పైగా మీరు ఆ రోజు దుర్మార్గమైన పని కూడా చేశారు. నాడు చంద్రబాబుపైనా ఈ వ్యవహారంలో ఆరోపణలు చేసే ప్రయత్నం చేయడం నిజం కాదా? ఆపై వెనక్కి తగ్గింది నిజం కాదా?  

సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో రిట్ కూడా వేసింది మీరే కదా. కానీ ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ వద్దన్నది కూడా మీరేగా. ఎందుకంటే ఆ చంపింది ఎవరో సీబీఐకి తెలియకూడదన్న ఉద్దేశంతోనే మీరు సీబీఐ విచారణ వద్దన్నారు. సీబీఐ విచారణ జరిగితే హత్య చేసింది ఎవరో అందరికీ తెలుస్తుంది... అందుకే మీరు ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలనుకున్నారు. ఇప్పుడు ఈ రాజకోట రహస్యాన్ని బహిర్గతం చేయాల్సింది మీరే. అందరి చూపులు ఇప్పుడు మీపైనే ఉన్నాయి. వివేకాను చంపింది ఎవరో మీకు తెలుసని అందరూ నమ్ముతున్నారు.

అసలు, నిన్న సునీతారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము మీకు ఉందా? ఈ కేసులో సాక్షులను చంపేస్తున్నారు సార్... గతంలో పరిటాల రవి ఉదంతంలో సాక్షులను, ముద్దాయిలను ఎలా అంతమొందించారో ఇప్పుడూ అలాగే జరుగుతోంది సార్. సాక్షులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? నిన్న సునీతారెడ్డి ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలన్నీ జగన్ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ కేసులో రహస్యం వెల్లడైతే ప్రభుత్వమే ఛిన్నాభిన్నమవుతుంది" అని వ్యాఖ్యానించారు.

More Telugu News