Andhra Pradesh: ఏపీలో అంతకంతకు విజృంభిస్తున్న కరోనా... కొత్తగా 758 మందికి పాజిటివ్

AP gets more corona cases in last twenty four hours
  • 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175 కేసులు
  • గుంటూరు జిల్లాలో 127 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో నలుగురి మృతి
ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. ఇటీవలే తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా 758 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మరో 127 మంది కరోనా బారినపడ్డారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. అదే సమయంలో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,201కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,95,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,209 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News

Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
Active Cases