రైల్లో ప్రయాణిస్తున్న మహిళ నుంచి 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు స్వాధీనం
- కేరళలో మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- తమిళనాడుకు చెందిన రమణిగా గుర్తింపు
- బావి తవ్వేందుకు తీసుకెళ్తున్నానని చెప్పిన మహిళ
- ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామన్న ఆర్పీఎఫ్
తమిళనాడుకు చెందిన రమణి అనే మహిళ చెన్నై మంగళపురం ఎక్స్ ప్రెస్ లోని డీ1 బోగీలో ప్రయాణిస్తోందని, చెకింగ్ లో భాగంగా సీటు కింద ఉన్న బ్యాగులను పరిశీలించగా అందులో పేలుడు పదార్థాలున్నాయని చెప్పారు. ముందు అవి తనవి కాదని చెప్పిన రమణి.. తర్వాత నిజం ఒప్పుకొందన్నారు. అయితే, బావి తవ్వేందుకు వాటిని తీసుకెళ్తున్నట్టు చెప్పిందన్నారు.
దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. నిఘా విభాగం పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తామన్నారు. ఆమెను విచారించేందుకు షోర్నూర్ కు తరలిస్తున్నట్టు సమాచారం. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పేలుడు పదార్థాల స్వాధీనం కలకలం సృష్టించింది.