Cheepurupalli: టీడీపీ నేత కళా వెంకటరావును విడిచిపెట్టిన పోలీసులు

  • రామతీర్థం ఘటన కేసులో గత రాత్రి అరెస్ట్
  • చీపురుపల్లి పోలీసులకు అప్పగింత
  • ఉగ్రవాదుల్లా రాత్రిపూట అరెస్టులేంటన్న అచ్చెన్న
  • తిరుపతి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం పట్టుకుందని ఎద్దేవా
TDP leader kala venkata rao released

విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకటరావును గత రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం విడుదల చేశారు. రాజాంలోని తన నివాసంలో గత రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ చేసిన నెల్లిమర్ల పోలీసులు అనంతరం చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత విడుదల చేశారు.

ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా దేవుడి కోసం టీడీపీ పోరాటం ఆగదని అన్నారు. తాము ప్రజలతోనే ఉంటామని, వారి కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజాగ్రహానికి ఎవరూ అతీతులు కారని అన్నారు. రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటని కళా వెంకటరావు నిలదీశారు.

అంతకుముందు కళా అరెస్ట్‌పై స్పందించిన ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల్లా రాత్రిపూట అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. కళాను విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం వైసీపీకి పట్టుకుందని, కళా అరెస్ట్‌కు వైసీపీ మూల్యం చెల్లించుకోకతప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

More Telugu News