Mumbai: రూ.4 వేలు ఇస్తే హోం క్వారంటైన్​ సర్టిఫికెట్​.. ఎయిర్​ పోర్టులో ఇంజనీర్​ లంచావతారం

  • విదేశీ ప్రయాణికులకు ఫేక్ సర్టిఫికెట్లు, స్టాంపులు
  • హౌస్ కీపింగ్ ఉద్యోగి ఫిర్యాదుతో వెలుగులోకి
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Pay and skip quarantine Cops bust scam at Mumbai airport

బ్రిటన్ కరోనా కేసులను నిరోధించడానికి.. విదేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల  క్వారంటైన్ ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కానీ, కొందరు అధికారులు దానిని సొమ్ము చేసుకుంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకుని ఫేక్ క్వారంటైన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అలాంటి ఘటనే ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (సీఎస్ఐఏ)లో జరిగింది.

రూ.4 వేలు లంచంగా తీసుకుని విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా, చేతిపై స్టాంప్ వేస్తున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సబ్ ఇంజనీర్ దినేశ్ గవాండే (35), అతడి అనుచరులు అష్రాఫ్ సారంగ్ (41), వివేక్ సింగ్ (32)లను పోలీసులు అరెస్ట్ చేశారు. దినేశ్ బ్యాగులో ఉన్న రూ.1.4 లక్షలు, 200 సౌదీ రియాల్స్, హోం క్వారంటైన్ ఫేక్ రబ్బర్ స్టాంప్, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన డాక్టర్ల సంతకాలు, స్టాంపులున్న కొన్ని నకిలీ లెటర్ హెడ్ లను స్వాధీనం చేసుకున్నారు.

దినేశ్ కు బీఎంసీ డిసెంబర్ 23 నుంచి ముంబై ఎయిర్ పోర్ట్ డ్యూటీ వేసింది. అప్పటి నుంచి దుబాయ్, కువైట్, అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులను చెక్ చేసే డ్యూటీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఒట్టి చేతులతో టాయిలెట్ లోకి వెళ్లి బ్యాగుతో తిరిగొచ్చాడు. అదే టైంలో డ్యూటీలోకి వచ్చిన హౌస్ కీపింగ్ ఉద్యోగిని తోసేసుకుంటూ వెళ్లిపోయాడు. అతడి వాలకంపై అనుమానం వచ్చిన ఆమె.. సీఐఎస్ఎఫ్, ఎయిర్ పోర్ట్ అధికారులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే దినేశ్ బ్యాగును చెక్ చేసిన అధికారులు కంగుతిన్నారు. అతడిని, అతడికి సహకరించిన అష్రాఫ్, వివేక్ లను పోలీసులకు అప్పగించారు. లంచం తీసుకుని ఫేక్ క్వారంటైన్ సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు దినేశ్ ఒప్పుకొన్నాడు. అష్రాఫ్, వివేక్ లకూ డబ్బులో వాటా ఇచ్చినట్టు చెప్పాడు.

More Telugu News