Narendra Modi: వ్యాక్సినేష‌న్ ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.. వ్యాక్సిన్ త‌యారీలో భార‌త స‌త్తా ప్రపంచానికి తెలిసిందని వ్యాఖ్య

  • క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురు చూసింది
  • వైద్యులు, ఇత‌ర‌ వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే వ్యాక్సిన్ తొలి హ‌క్కుదారులు
  • వ్యాక్సిన్ కోసం శాస్త్ర‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు
  • క‌రోనాను ఎదుర్కొనేందుకు చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా చూపాలి
  • తొలి విడ‌త‌లో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్  
modi launches vaccination in india

దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ తీసుకోనున్న వారికి ఇప్పటికే వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా మెసేజ్ లు పంపారు. వ్యాక్సిన్ కోసం కేంద్రాల వ‌ద్ద ఎదురు చూస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ...  క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురు చూసిందని చెప్పారు.

వైద్యులు, ఇత‌ర‌ వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే వ్యాక్సిన్ తొలి హ‌క్కుదారులని మోదీ అన్నారు. వ్యాక్సిన్ల త‌యారీ కోసం చాలా మంది విశ్రాంతి లేకుండా శ్ర‌మించారని కొనియాడారు. వ్యాక్సిన్ కోసం శాస్త్ర‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారని తెలిపారు.

అతి త‌క్కువ స‌మ‌యంలో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారని మోదీ తెలిపారు. శాస్త్ర‌వేత్త‌ల కృషికి ఫ‌లితంగా దేశంలో రెండు వ్యాక్సిన్లు వ‌చ్చాయని చెప్పారు. మ‌రికొన్ని వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వ‌స్తాయని అన్నారు.

దేశీయ వ్యాక్సిన్ త‌యారీలో భార‌త స‌త్తా ఏంటో మ‌రోసారి ప్రపంచానికి తెలిసిందని మోదీ తెలిపారు. క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిసరని తెలిపారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా చూపాలని తెలిపారు. తొలి విడ‌త‌లో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామ‌ని వివ‌రించారు. అలాగే, రెండో విడ‌త‌లో 30 కోట్ల మందికి వేస్తామ‌ని అన్నారు. మ‌న దేశ సైన్స్ స‌మ‌ర్థ‌త‌పై ప్ర‌పంచమంతా విశ్వాసంతో ఉందని తెలిపారు. విదేశీ వ్యాక్సిన్ల కంటే మ‌న దేశంలోని వ్యాక్సిన్లు చౌక ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్నాయ‌ని మోదీ అన్నారు.

వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మోదీ  వ్యాక్సిన్ తీసుకున్న కొందరితో కాసేప‌ట్లో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తి‌లో ముచ్చటించనున్నారు. తెలంగాణ‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ నిమ్స్‌లో, తెలంగాణ‌ మంత్రి ఈటల రాజేంద‌ర్ గాంధీ ఆసుప‌త్రిలో వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు.

కాగా, వ్యాక్సినేష‌న్ కోసం ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డును వ్యాక్సిన్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత‌ అరగంట పాటు వారిని ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్య పరిస్థితులను గమనిస్తారు. వారు ఒక‌వేళ అస్వ‌స్థ‌త‌కు గురైతే అత్యవసర వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు.

More Telugu News